ఓటమి ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు

  • ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
  • పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు
  • వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు యత్నాలు
  • 'చూస్తూ ఉండండి' అంటూ ఉత్కంఠ రేపిన సీనియర్ నేత షణ్ముగం
  • పళనిస్వామి నాయకత్వానికే మద్దతు తెలిపిన కొందరు నేతలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కేవలం 47 సీట్లకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడంతో పార్టీలో నాయకత్వ మార్పుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి (ఈపీఎస్), సీనియర్ నేత సీవీ షణ్ముగం వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

శనివారం పళనిస్వామి తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన వెంటనే చెన్నైలోని షణ్ముగం నివాసంలో మరో కీలక సమావేశం జరిగింది. దీనికి దాదాపు 37 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం. ఈ పరిణామం పార్టీలో వర్గపోరును స్పష్టం చేస్తోంది. కొందరు నేతలు ముందుగా పళనిస్వామిని కలిసి, ఆ తర్వాత షణ్ముగం వద్దకు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

షణ్ముగం వర్గంలో ఎస్పీ వేలుమణి, సీ విజయభాస్కర్, కేసీ వీరమణి వంటి సీనియర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పళనిస్వామి వర్గం నిర్వహించిన సమావేశానికి 16 మంది జిల్లా కార్యదర్శులు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎవరికి ఎంతమంది మద్దతు ఉందనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ రాజకీయ పరిణామాలపై షణ్ముగం స్పందిస్తూ.. ‘చూస్తూ ఉండండి’ అని వ్యాఖ్యానించడం ఉత్కంఠ రేపుతోంది.

అయితే, ఈ సంక్షోభంపై మాజీ ఎమ్మెల్యే మణిమేఖలై స్పందిస్తూ పళనిస్వామికి మద్దతు పలికారు. అన్నాడీఎంకేను నడిపించే సత్తా ఆయనకు మాత్రమే ఉందని, దాదాపు 98,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటమికి గల కారణాలను పార్టీ సమీక్షించుకుని ‘రెండాకుల’ గుర్తుకు పూర్వ వైభవం తెస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Edappadi K Palaniswami
AIADMK
Tamil Nadu Elections
CV Shanmugam
Tamil Nadu Politics
AIADMK Faction War
Tamil Nadu Assembly
EPS vs Shanmugam
Manimekalai
Tamil Nadu Political Crisis

More Telugu News